చరిత్ర అధ్యయనం – ఆధారాలు

Indian history sources

‘HISTORY’ అనే పదం ‘Historia’ లేదా ‘ఇస్తోరియా’ అనే గ్రీక్‌ పదం నుంచి ఆవిర్భవించింది. దీని అర్థం ‘పరిశోధన/ అన్వేషణ’.

చరిత్రను అధ్యయనం చేయడానికి పురావస్తు, సాహిత్య ఆధారాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

పురావస్తు ఆధారాలు (Archaeological Sources)

పురావస్తు శాస్త్రవేత్తలు గతాన్ని నిర్మించడానికి వివిధ ఆధారాలను ఉపయోగిస్తారు. అందులో శాసనాలు, నాణెములు, కట్టడాలు, శిల్పాలు మరియు త్రవ్వకాలలో బయల్పడిన వస్తు అవశేషాలు మొదలైనవి ముఖ్యమైనవి.

Inscriptions (శాసనాలు)

ఏదైనా గట్టి ఉపరితలముపైన లిఖించబడిన శాశ్వత లిపిని శాసనము అంటాము. శాసనాల్లో ఉన్న సమాచారమును అనుసరించి వీటిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

  1. ప్రశస్తి శాసనాలు (Eulogies)
  2. రాజాజ్ఞలు (Edicts)
  3. దాన శాసనాలు (Land Charters)
ప్రశస్తి శాసనాలు:

రాజుల విజయాలను, గొప్పతనాన్ని కీర్తిస్తూ వేసే శాసనాలను ప్రశస్తి శాసనాలు అంటారు.

ఉదాహరణ:

  1. సముద్రగుప్తుడి అలహాబాద్‌ శాసనము,
  2. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క నాసిక్‌ శాసనము
  3. రెండవ పులకేశి యొక్క ఐహోలు శాసనము మొదలుగునవి.
రాజాజ్ఞలు:

రాజులు లేదా పరిపాలకులు తమ ఉత్తర్వులను మరియు ఆజ్ఞలను తెలియజేన్తు వేసే శాసనాలను రాజాజ్ఞలు అంటారు.

ఉదాహరణ:  అశోకుడు వేసిన శాసనాలు అన్నీ రాజాజ్ఞలే.

దాన శాసనాలు:

పురోహితులకు లేదా మతసంస్థలకు ఇచ్చిన భూదానాలను (Endowments) అంటారు. సాధారణంగా వీటిని రాగిరేకులపైన లిఖిస్తారు. అందుకే వీటిని తామ్రఫలక శాసనాలు (Copper plate inscriptions) అని అంటారు.

Note:  ప్రశస్తి శాసనాలు మరియు రాజాజ్ఞలను రాజులు/ పరిపాలకులు మాత్రమే వేస్తారు. కాని దానశాసనాలను రాజులతో పాటు సాధారణ వ్యక్తులు కూడా వెయ్యవచ్చు.

ఎపీగ్రఫీ (Epigraphy):

పురావస్తు శాస్రములో శాసనాలను అధ్యయనము చెయ్యడానికి ఎపిగ్రఫీ (Epigraphy) అనే ప్రత్యేక విభాగముంది. శాసనాల్లోని ప్రాచీన లిపులను అధ్యయనము చెయ్యడానికి పాలియోగ్రఫీ (Paleography) అనే విభాగం ఉంది.

సింధు నాగరికత కాలం నాటి ముద్రికలపైన ఉన్న చిత్రలిపిని భారతదేశంలో తొలి శాసనాలుగా భావించవచ్చు. అయితే ఈ శాసనాలను ఇప్పటి వరకు ఎవరు చదవలేకపోయారు.

క్రీ.పూ.3వ శతాబ్దంలో అశోకుడు వేసిన శాసనాలే మన దేశంలో పండితులు చదవగలిగిన తొలి శాసనాలుగా గుర్తించవచ్చు. ఈ శాసనాలు ప్రాకృత భాషలో, బ్రాహ్మీ లిపిలో వేయబడ్డాయి. తరువాత కాలం నాటి సంస్కృత శాసనాలు కూడా చాలా వరకు బ్రాహ్మీ లిపిలోనే వేయబడ్డాయి.

నాణెములు (Coins):

పురావస్తు శాస్త్రములో నాణెములను అధ్యయనము చెయ్యడానికి ‘న్యుమిస్‌మ్యాటిక్స్‌’ (Numismatics) అనే ప్రత్యేక విభాగముంది.

ఒక కాలంలో ముద్రించబడిన నాణెములు ఆ కాలానికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక, మతపరమైన విషయాలను తెలియజేస్తాయి. మనదేశములో క్రీ.పూ.6వ శతాబ్దములో ముద్రించిన విద్దాంక నాణెములను (Punch marked coins) తొలి నాణెములుగా భావిస్తున్నారు.

మౌర్యుల పూర్వయుగంలో మరియు మౌర్య యుగంలో ఈ నాణెముల వాడకం కొనసాగింది. ఇవి రాగి, వెండి లోహాలతో చేయబడ్డాయి. వీటిపైన బొమ్మలను ముద్రించారు. అయితే ఈ నాణెములపైన ఎటువంటి లిపి లేకపోవడంతో వీటిని ముద్రించిన పరిపాలకుల గురించిన వివరాలు తెలియడం లేదు.

మౌర్యుల అనంతర యుగంలో భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజులు (ముఖ్యంగా ఇండోగ్రీకులు మొదటిసారిగా) బంగారు నాణెములను ప్రవేశపెట్టారు.

కట్టదాలు మరియు శిల్పాలు (Monuments and Sculptures):

కట్టడాలను మరియు శిల్పాలను అధ్యయనము చేయడానికి ‘ఐకనోగ్రఫి’ (Iconography) అనే విభాగముంది.

ప్రాచీన కట్టడాలు మరియు శిల్పాలు కూడా ఒక కాలానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తాయి. ఉదాహరణకు తాజ్‌మహల్‌ ఆనాటి మొగల్‌ చక్రవర్తుల వైభవోపేతమైన జీవితాన్ని తెలియజేస్తుంది.

కాకతీయుల కాలం నాటి రామప్ప ఆలయంలోని శిల్పాలు ఆనాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక మరియు మతపరమైన విషయాలను తెలియజేస్తాయి.

 త్రవ్వకాల్లో బయల్పడిన వస్తు అవశేషాలు (Excavated Material):

గతాన్ని అధ్యయనం చేయడానికి త్రవ్వకాల్లో బయల్పడిన వస్తు అవశేషాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఉదాహరణ:  కుండలు (Pottery,) ఆహారధాన్యాలు, వస్త్రాలు, ఆయుధాలు, పనిముట్లు, ఆభరణాలు, గృహ అవశేషాలు మొదలగునవి ఆనాటి సమకాలీన పరిస్థితులను మనకు కళ్లకు కట్టినట్లుగా తెలియజేస్తాయి.

పురావస్తు శాస్త్రంలో ప్రాచీన వస్తువుల కాలాన్ని నిర్ధారించే పద్దతులు

త్రవ్వకాల్లో బయల్పడిన వస్తు అవశేషాల కాలాన్ని కచ్చితంగా నిర్ణయించే అనేక శాస్త్రీయ పద్దతులను పురావస్తు శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా ఆ వస్తువుల కాలంతో పాటు, త్రవ్వకాలు జరిపిన ప్రాంత కాలాన్ని కూడా నిర్ధారిస్తారు. కొన్ని ముఖ్యమైన శాస్త్రీయ కాల నిర్ధారణ పద్దతులను (Dating methods) గురించి తెలుసుకుందాం.

రేడియో-కార్చన్‌ డేటింగ్‌ (Radio carbon dating):

ఈ విధానాన్ని 1949లో చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన విల్లార్డ్‌ లిబ్బీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. త్రవ్వకాల్లో బయల్పడిన జీవ సంబంధ అవశేషాల కాలాన్ని ఈ పద్దతి ద్వారా కనుగొనవచ్చు.

అణుధార్మికత కలిగిన రేడియో కార్బన్‌ (C-14) ను ప్రతి జీవి ప్రకృతి నుండి స్వీకరిస్తూ ఉంటుంది. ఆ జీవి మరణించిన తర్వాత అందులోని C-14 క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. యాభై శాతం C-14 తగ్గడానికి 5568 సంవత్సరాలు పడుతుంది. దీనినే ‘Halflife’ అంటారు.

రేడియో కార్బన్‌ ఎంత మేరకు క్షీణించిందో తెలుసుకోవడము ద్వారా ఆ జీవి  యొక్క కాలాన్ని నిర్ధారిస్తారు. C-14 తక్కువ ఉంటే ఆ జీవి అవశేషాలు చాలా ప్రాచీనమైనవిగా గుర్తించవచ్చు.

పాటాషియం – ఆర్గాన్‌ డేటింగ్‌ (Potassium – Argon Dating):

ఈ పద్దతి ద్వారా శిలల ఆవిర్భావ కాలాన్ని లెక్కిస్తారు. అగ్నిపర్వత ప్రాంతాల్లో లభించిన శిలాజాల కాలాన్ని ఈ పద్ధతి ద్వారా గుర్తిస్తారు.

యురేనియం – లెడ్‌ డేటింగ్‌ (Uranium – Lead Dating):

లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన శిలల కాలాన్ని కూడా ఈ పద్దతి ద్వారా తెలుసుకోవచ్చు.

డెండ్రొక్రోనాలజీ డేటింగ్‌ (Dendrochronology/ Tree-ring Dating):

ఈ పద్దతి ద్వారా ప్రాచీన వృక్షాల వలయాలను (Tree rings) అధ్యయనం చేసి వాటి కాలాన్ని శాస్త్రీయంగా నిర్ధారిస్తారు.

థెర్మాల్యుమినిసెన్స్‌ డేటింగ్‌ (Thermoluminescence Dating):

నిప్పుల్లో కాల్బబడిన ప్రాచీన వస్తువుల కాలాన్ని తెలుసుకోవడానికి ఈ పద్దతిని ఉపయోగిస్తారు.

ఉదాహరణకు కాల్చిన ఇటుకలు, కుండలు మరియు ఇతర వస్తువుల కాలాన్ని ఈ విధానం ద్వారా నిర్ధారిస్తారు.

సాహిత్య ఆధారాలు (Literary Sources)

పురావస్తు శాస్త్రవేత్తలు గతాన్ని అధ్యయనం చేయడానికి పురావస్తువులను అధ్యయనం చేస్తారు. చరిత్రకారులు మాత్రం గతాన్ని అధ్యయనం చేయడానికి సాహిత్య ఆధారాలను ఉపయోగించుకుంటారు.

సాహిత్య ఆధారాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:

  1. స్వదేశీ సాహిత్యం
  2. విదేశీ సాహిత్యం
స్వదేశీ సాహిత్యం/ గ్రంథాలు (Indigenous Accounts)

ఇవి భారతీయుల ద్వారా వ్రాయబడిన గ్రంథాలు. వీటిని మరలా రెండు రకాలుగా విభజించవచ్చు.

మతగ్రంథాలు:

ఇవి వివిధ మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలు. ఉదాహరణకు వైదిక/ హిందూ గ్రంథాలు, జైన గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలు మొదలైనవి.

క్రీ.పూ.1500-1000 కాలం నాటి ఋగ్వేదము భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే తొలి గ్రంథంగా భాసిల్లుతోంది.

లౌకిక గ్రంథాలు:

ఇవి ఏ మతానికి సంబంధము లేని గ్రంథాలు. క్రీ.పూ.5వ శతాబ్దంలో పాణిని వ్రాసిన అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథం మనదేశంలో తొలి లౌకిక గ్రంథముగా గుర్తించబడింది.

భారతీయ చారిత్రక రచనలో కల్హణుడు రాసిన రాజతరంగిణి గొప్ప చారిత్రక రచనగా గుర్తించబడుతోంది.

విదేశీ సాహిత్యం/ గ్రంథాలు (Foreign Accounts)

అతి ప్రాచీన కాలం నుంచి భారతదేశాన్ని అనేక మంది విదేశీయులు సందర్శించి, అమూల్యమైన సమాచారాన్ని గ్రంథస్తం చేశారు. వీరు భారతదేశానికి దండయాత్రీకులుగా, రాయబారులుగా, తీర్థయాత్రికులుగా, వ్యాపారస్తులుగా, పర్యాటకులుగా వచ్చి, తమ అనుభవాలను అద్భుతమైన రీతిలో గ్రంథస్తం చేశారు.

Note: చరిత్ర రచనకు స్వదేశీ సాహిత్యం కంటే విదేశీ సాహిత్యాన్ని అత్యంత విశ్వసనీయమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే విదేశీయుల రచనల్లో సాధారణంగా పక్షపాత వైఖరి కొంచెం తక్కువగా ఉంటుంది.

కొన్ని ముఖ్యమైన విదేశీ గ్రంథాలు

గ్రీకు గ్రంథాలు:

మెగస్తనీస్‌ వ్రాసిన ‘ఇండికా’, గ్రీకు గ్రంథాలన్నింటిలోను అత్యంత ప్రముఖమైనది. ఇది మౌర్యుల గురించి తెలియజేస్తుంది. వాస్తవానికి ఈ ఇండికా వర్జినల్‌ కాపీ ప్రస్తుతం లభ్యం కావడం లేదు.

లాటిన్‌ గ్రంథాలు:

ప్లీని లాటిన్‌ భాషలో రచించిన ‘నాచురల్‌ హిస్టరీ’ గ్రంథంలో, ప్రాచీన కాలం నాటి ఇండో-రోమన్‌ వ్యాపారం గురించిన వివరాలు కూలంకషంగా చర్చించాడు.

చైనీస్‌ గ్రంథాలు:

చైనీస్‌ భాషలలో వ్రాయబడిన గ్రంథాల్లో అత్యంత ముఖ్యమైనది ‘హ్యూయాన్‌త్సాంగ్‌ లేదా యువాన్‌ చాంగ్‌’ రాసిన ’సీ-యూ-కీ’. ఈ గ్రంథము క్రీ.శ.7వ శతాబ్దములో ఉత్తర భారతదేశాన్ని పాలించిన హర్షవర్ధనుని గురించి తెలియజేస్తుంది.

టిబెటన్‌ గ్రంథాలు:

‘దివ్యవదన’ అనే టిబెటన్‌ బౌద్ధ గ్రంథము అశోక చక్రవర్తి గురించి వివరిస్తుంది.

శ్రీలంక గ్రంథాలు:

దీపవంశ, మహావంశ, కులవంశ అనే సింహళ బౌద్ధ గ్రంథాలు బౌద్ధ మతం గురించి, మౌర్యు వంశం గురించిన వివరాలను అందిస్తున్నాయి.

అరబిక్‌ గ్రంథాలు:

మధ్యయుగంలో అనేకమంది అరబ్బు యాత్రికులు భారతదేశాన్ని సందర్శించి సమకాలీన పరిస్థితులను గ్రంథస్తం చేశారు.

ఈ సాహిత్య ఆధారాల ద్వారానే చరిత్రకారులు మన భారతదేశ చరిత్రను ఒక క్రమ పద్ధతిలో నిర్మించారు.

ఇదీ చదవండి: పంచతంత్రం

ఇదీ చదవండి: ఫండమెంటల్ ఎనాలసిస్ వర్సెస్‌ టెక్నికల్ ఎనాలసిస్

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?