దక్షిణ భారతదేశంలోని మూడు తమిళ రాజ్యాలు
ప్రాచీన దక్షిణ భారతదేశంలో చోళ, చేర, పాండ్య అనే మూడు రాజ్యాలు వెలిశాయి. వీరు తమిళ భాష మరియు సాహిత్యమును ఆదరించి అభివృద్ధి చేసినందువల్ల ఈ మూడు రాజ్యాలను తమిళ రాజ్యాలు అంటారు. ఈ మూడు రాజ్యాల సమాచారము క్లుప్తంగా క్రింది పట్టికలో తమిళ ఇవ్వడమైనది.
రాజ్యం పేరు | పాలించిన ప్రాంతం | రాజధాని | రాజకీయ చిహ్నం | గొప్పరాజు |
చోళ
|
ఉత్తర తమిళనాడు
|
ఉరయ్యూరు తరువాత కావేరీ పట్టణం | పులి | కరికాలచోళ |
పాండ్య | దక్షిణ తమిళనాడు | మధురై | చేప | నెడుంజెళియన్ |
చేర | కేరళ | వంజి / కరూర్ | విల్లు, బాణము | సెంగుత్తవాన్ |
తమిళ సాహిత్యము / సంగం సాహిత్యము
ఈ మూడు రాజ్యాల ఆదరణలో తమిళ సాహిత్యము ఆరంభమయ్యింది. ఈ కాలం నాటి తమిళ సాహిత్యాన్ని సంగం సాహిత్యము అని పిలుస్తారు. పాండ్యుల రాజధాని నగరమైన మధురైలో నిర్వహించబడిన మూడు తమిళ కవుల సమ్మేళనాలను ‘సంగం’లు అంటారు. చోళ, చేర, పాండ్య రాజ్యాల నుండి అనేక మంది తమిళ కవులు ఈ సమావేశాలకు హాజరై అద్భుత తమిళ సాహిత్యాన్ని అందించారు. ఏడవ శతాబ్దంలో తిరునవక్కరసు లేదా అప్పార్ అనే జైన మతాచార్యుడు తొలిసారిగా సంగం అనే పదాన్ని ఉపయోగించాడు.
I. తలైసంగం:
ఇది తొలి సంగం. అగస్త్య మహాముని దీనికి అధ్యక్షత వహించారని చెప్పబడింది. ఆర్య సంస్కృతిని దక్షిణానికి పరిచయము చేసిన వ్యక్తిగా అగస్త్య మహామునికి గుర్తింపు ఉంది. తొలి సంగంలో వ్రాయబడిన గ్రంథాలు లభ్యము కావడము లేదు.
II. ఇడైసంగం:
ఇది రెండవ సంగం. అగస్త్య మహాముని యొక్క 12 మంది శిష్యులు దీన్ని నిర్వహించారు. తమిళ భాషలో లభ్యమవుతున్న తొలి గ్రంథాలు ఈ సంగంలోనే వ్రాయబడ్డాయి. ఈ సమావేశంలో తొల్కాప్పియార్ రచించిన తొల్కాప్పియం తమిళ సాహిత్యంలోని తొలి గ్రంథం. ఇది వ్యాకరణ గ్రంథం. ఈ సమావేశంలోనే అగత్తియార్ అనే కవి అగత్తీయము అనే ఇంకొక వ్యాకరణ గ్రంథం వ్రాశాడు.
III. కడై సంగం:
ఇది మూడవ మరియు చివరి సంగం. నక్కిరార్ అనే తమిళ కవి దీనికి అధ్యక్షత వహించాడు. ఈ సంగంలో అనేక గొప్ప తమిళ గ్రంథాలు వ్రాయబడ్డాయి. కడై సంగంలో రచించబడిన సాహిత్యాన్ని మూడు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు.
- పదినిన్మేల్ కనక్కు (18 Major Works): అందులో ఈ క్రింది గ్రంథాలు ముఖ్యమైనవి.
- అగనన్నూరు – (అగము అంటే ప్రేమ / శృంగారము; నన్నూరు అంటే 400). ఇందులో 400 ప్రేమ/ శృంగార కవితలుంటాయి. దీనిని రుద్రశర్మన్ రచించాడు.
- పురనన్నూరు – (పురము అంటే రాజనీతి / యుద్ధాలు; నన్నూరు అంటే 400). ఇందులో యుద్ధాలు మరియు రాజనీతికి సంబంధించి 400 కవితలుంటాయి. మాములనార్ దీని రచయిత.
- తిరుమురుగరుప్పదై – తమిళుల ఆరాధ్య దైవము ‘మురుగ’ (సుబ్రమణ్య / కార్తికేయ / కుమారస్వామి) పైన వ్రాయబడింది. ఈ గ్రంథాన్ని నక్కిరార్ అనే కవి రచించాడు.
- మధురైకంజి – పాండ్యుల రాజధానియైన మధురై నగరం గురించి మాగుడిమరుదన్ అనే తమిళ కవి రచించాడు.
- పట్టినిపలై – ఇది చోళుల రాజధాని కావేరి పట్టణముపైన వ్రాయబడింది. కన్నన్ దీని రచయిత.
- పదినిన్కిల్ కనక్కు (18 Minor Works):
అందులో తిరువళ్ళువార్ రచించిన తిరుక్కురల్ అత్యంత ముఖ్యమైనది. ఇందులో నీతి సూత్రాలు, ధర్మశాస్త్రాలు మరియు పాలనాపరమైన సమాచారం ఉంటుంది. దీనిని తమిళ సాహిత్యపు బైబిల్ అంటారు.
- ఇతిహాసాలు: సంగం సాహిత్యంలో మూడు ఇతిహాసాలున్నాయి.
- శిలప్పాదికారం: ఇల్లాంగొ అడిగల్ దీని రచయిత. ఇది కోవలన్ మరియు కన్నగి అనే దంపతుల గాథ. తమిళ ప్రజలు నేటికీ కన్నగిని పాతివ్రత్యదేవతగా ఆరాధిస్తున్నారు.
- మణిమేగలై: సత్తలై సత్తనార్ అనే బౌద్ధుడు దీని రచయిత. అనేక కళల్లో ఆరితేరిన అద్భుత సౌందర్యవతి మణిమేగలై ఇందులో కథానాయకి. ఈమె చివరకు బౌద్ధభిక్షుణిగా మారిపోతుంది.
- శివగసింధమని: తిరుత్తక్కదేవర్ అనే జైన కవి దీనిని రచించాడు. అనేక రాజ్యాలు జయించి చివరకు జైన సన్యాసిగా మారిన శివగ / జీవక అనే రాజు గాథ ఇందులోని కథాంశం.