ఆర్యుల రహస్యాలు: వైదిక నాగరికత విశేషాలు (Part-2)

Aryans and Vedic Civilization

భారతదేశంలో ఒక మహా నాగరికతను నిర్మించిన ఆర్యుల జన్మస్థలం గురించి చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. వీరి సాహిత్యంలో వీరి జన్మస్థలం గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఆర్యులు స్వదేశీయులని కొందరు, విదేశీయులని మరికొందరు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. వాటిలో కొన్ని అభిప్రాయాలను పరిశీలిద్దాం.

అవినాష్ చంద్రదాస్, డా. సంపూర్ణానంద్, గంగానాథ్‌ ఝా మరియు డి.యస్.త్రివేది లాంటి పండితులు ఆర్యులు స్వదేశీయులని, సప్తసింధు ప్రాంతము వీరి జన్మస్థలమని వాదించారు. సప్తసింధు అంటే ఏడు నదుల ప్రాంతము. ఇది ప్రధానంగా సరస్వతి మరియు సింధు లోయ ప్రాంతము. ఈ ఏడు నదులను క్రింది పట్టికలో చూపించవచ్చు.

ప్రస్తుత పేరు వేదాల్లోని పేరు గ్రీకు గ్రంథాల్లోని పేరు
సరస్వతి సరస్వతి పర్షియన్‌ల పవిత్ర గ్రంథమైన జెండ్‌ అవెస్తాలో హర్కావతిగా పిలువబడింది.
సింధు సింధు ఇండస్‌ (Indus)
సట్లెజ్‌ సతుద్రి జెరాడ్రస్‌ (Zeradrus)
రావి పరుష్ని హైడ్రోట్స్‌ (Hydrotes)
చీనాబ్‌ అసికిని అకెసిన్స్‌ (Akesins)
జీలం వితస హైడాస్పస్‌(Hydaspus)
బియాస్‌ విపస హైపసిస్‌(Hypases)
నోట్‌: చివరి ఐదు నదులు సింధు నది యొక్క ఉపనదులు

 

  • దయానంద సరస్వతి ప్రకారం ఆర్యులు టిబెట్ నుంచి భారతదేశానికి వలస వచ్చారు.
  • బాలగంగాధర తిలక్ ఆర్యులు ఉత్తర ధృవ ప్రాంతమైన ఆర్కిటిక్ నుంచి భారతదేశానికి వలస వచ్చారని అభిప్రాయపడ్డారు. ‘The Arctic Home in the Vedas’ అనే గ్రంథాన్ని వ్రాశారు.
  • మ్యాక్ డొనాల్డ్ మరియు డా.పెంక అనే పండితులు ఆర్యులు జర్మనీ – ఆస్ట్రియా ప్రాంతం వారని అభిప్రాయపడ్డారు.
  • మ్యాక్స్ ముల్లర్ (Max Muller) అనే జర్మన్ ఇండాలజిస్ట్ ఆర్యులు మధ్య ఆసియా నుండి భారతదేశానికి వలస వచ్చి క్రీ.పూ.1500 కాలంలో సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డారని అభిప్రాయపడ్డారు. ఆర్యులు మధ్య ఆసియా నుంచి వలస వచ్చారని అక్కడ లభించిన భోగజ్‌కోయి శాసనం కూడా పరోక్షంగా తెలియజేస్తుంది. ఈ శాసనం క్రీ.పూ.1400లో క్యూనిఫాం లిపిలో వెయ్యబడింది. ఈ శాసనము హిటైట్ మరియు మిత్తని అనే రెండు ఆర్య తెగల మధ్య యుద్ధం గురించి తెలియజేస్తూ ఇంద్ర, వరుణ, మిత్ర, ససత్య అనబడే నలుగురు ఆర్యదేవతలను ప్రస్తావిస్తుంది. ప్రస్తుతానికి మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయాన్ని ఎక్కువ మంది పండితులు ఆమోదిస్తున్నారు.
ఇండాలజీ

భారతదేశాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇండాలజీ అంటారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారత ప్రజలు ఇత్యాది అంశాలను ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. దీనిని 18వ శతాబ్దములో ఐరోపాకు చెందిన పండితులు అభివృద్ధి చేశారు. ప్రముఖ ఇండాలజిస్ట్‌లు:

  • విలియం జోన్స్: ఇతను ఇంగ్లాండ్‌కు చెందిన ఇండాలజిస్ట్. 1784 కలకత్తాలో ‘Asiatic Society of Bengal’ అనే సంస్థను స్థాపించాడు. కాళిదాసుడు రచించిన అభిజ్ఞాన శాకుంతలమును ఇంగ్లీషులో అనువదించాడు.
  • ఛార్లెస్ వికిన్స్: ఇతను బ్రిటీష్ ఇండాలజిస్ట్. భగవద్గీతను ఇంగ్లీషులోకి అనువదించాడు. నోట్‌: విలియం జోన్స్ మరియు ఛార్లెస్ వికిన్స్‌లను ఇండాలజీ పితామహులు (Fathers of Indology) అని పిలుస్తారు.
  • మ్యాక్స్ ముల్లర్: ఇతను జర్మన్ ఇండాలజిస్ట్. ఋగ్వేదాన్ని ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేశారు.
  • ఏ.యల్.భాషం: ఇతను ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు. ప్రాచీన భారతదేశ చరిత్ర మరియు సంస్కృతిపైన ‘The Wonder That Was India’ అనే పుస్తకం రచించాడు.

ఆర్యుల నాగరికతను అధ్యయన సౌలభ్యం కొరకు రెండు దశలుగా విభజించి అధ్యయనం చేస్తారు.

  • మొదటిదశ (క్రీ.పూ.1500-1000): ఈ కాలాన్ని తొలి వేదయుగమని లేదా ఋగ్వేద యుగమని పిలుస్తారు. ఎందుకంటే ఈ కాలాన్ని అధ్యయనము చెయ్యడానికి ఋగ్వేదం ఒక్కటే ఆధారం.
  • రెండవదశ (క్రీ.పూ.1000-600): ఈ కాలాన్ని మలివేద యుగము అని అంటారు.
ఆర్యుల భౌగోళిక పరిజ్ఞానము

ఋగ్వేదకాలం :

ఋగ్వేద కాలంలో ఆర్యులు భారతదేశంలోని సప్త సింధు ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యారు. తూర్పున యమున, దక్షిణాన ఆరావళి ప్రాంతం వరకే వీరి భౌగోళిక పరిజ్ఞానం పరిమితమైనది. ఈ కాలం నాటి ఆర్యులకు సముద్రము తెలియదు. వాస్తవానికి ఋగ్వేదంలో సముద్రము అనే పదము ప్రస్తావించబడినప్పటికీ అది నదుల సంగమ ప్రాంతాలను మాత్రమే తెలియజేస్తుంది. ఋగ్వేదంలోని శ్లోకాలలో గంగానది ప్రస్తావించబడినప్పటికీ, ఆర్యులకు గంగానది పరిజ్ఞానం లేదు. ఇది తర్వాత కాలంలో వ్రాయబడ్డ శ్లోకాల్లో చెప్పబడింది (later interpolation). ఆర్యులు తూర్పు వైపున యమునా నది దాటి వెళ్లలేదు కాబట్టి వీరికి గంగానది తెలిసే అవకాశం లేదు. ఋగ్వేదకాలం నాటి ఆర్యులు సింధు నాగరికత వెలిసిన ప్రాంతాల్లోనే జీవించారు.

మలివేదకాలం :

క్రీ.పూ.1000 కాలంలో మలివేదకాల ఆర్యులు సప్తసింధు ప్రాంతంనుంచి గంగామైదాన ప్రాంతాలకు వలస వెళ్ళారు. శతపథ బ్రాహ్మణము ఈ విషయాన్ని తెలియజేస్తూ, వైధేగమాధవ అనే ఒక తెగ నాయకుడు తన తెగతో కలిసి సరస్వతి నుంచి వలసవెళ్ళి సదానిర (గంగానదికి ఉపనది అయిన గండక్) నదీ తీర ప్రాంతంలో స్థిరపడ్డాడని చెబుతుంది.

ఐతరేయ బ్రాహ్మణము దక్షిణ భారతదేశంలోని సముద్రాలను మరియు అక్కడ నివసిస్తున్న తెగల గురించి సమాచారాన్ని ఇస్తుంది. మలివేద ఆర్యులకు భారతదేశంలోని అన్ని ప్రాంతాల భౌగోళిక పరిజ్ఞానము ఉన్నట్లుగా దీనిద్వారా అర్థం చేసుకోవచ్చు.

ఆర్యుల ఆర్థిక వ్యవస్థ

ఋగ్వేదకాలం :

ఋగ్వేదకాలంలో పశుపోషణ ఆర్థిక వ్యవస్థ (pastoral economy) కొనసాగింది. ఋగ్వేదంలో 215 సార్లు గుర్రం, 176 సార్లు గోవు ప్రస్తావించబడ్డాయి. ఈ కాలం నాటి ఆర్యుల సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితులు గోవు చుట్టూ అల్లుకున్నాయి. రాజును గోప లేదా గోపతి అని, ధనవంతుడిని గోమత్‌ అని, యుద్ధాలను గవిస్తి అని, అతిథిని గోఘన అని పిలిచారు. వ్యవసాయము చాలా పరిమితంగా ఉండేది. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన ఏకైక ధాన్యం ‘యవ’, గోధుమలు మరియు బార్లీని యవలు అన్నారు. వారి ప్రస్తావన లేదు. వ్యవసాయంలో నాగలి (సిర/ లంగాల)ని విరివిగా ఉపయోగించారు. దున్నిన భూమిని సీత అని, పంట కాలువలను కుల్య అని పిలిచారు.

తొలివేద కాలం నాటి ప్రధాన పరిశ్రమలు:

  • కుండల పరిశ్రమ: కుండలను తయారుచేసే వారిని కులల/ కులారిక అన్నారు.
  • వస్త్ర పరిశ్రమ: వస్త్రాలు నేసేవారిని వ్యాయ/కోలికులు అంటారు. ప్రధానంగా మహిళలు వస్త్ర పరిశ్రమలో కీలకపాత్ర పోషించారు.
  • లోహ పరిశ్రమ: ఋగ్వేదంలో రాగి మరియు కాంస్యమును ‘ఆయ’ అని పిలిచారు. ఈ యుగంలో ఇనుము వాడకం ప్రారంభం కాలేదు.
  • వండ్రింగి పరిశ్రమ: వడ్రంగులను తక్షణ్ అన్నారు..
  • ఆభరణాల పరిశ్రమ: బంగారు, వెండి ఆభరణాలు తయారు చేసేవారు.

వ్యాపార వాణిజ్యాలు నామమాత్రంగా కొనసాగాయి. సాధారణంగా పశుపోషణ సమాజాల్లో వ్యాపారాభివృద్ధి పెద్దగా ఉండదు. క్రయ విక్రయాలలో ‘సువర్ణనిష్క’ను ఉపయోగించారు. ఆర్యుల నాగరికతలో నాణెములు ఎక్కడా లభ్యం కాలేదు కాబట్టి సువర్ణనిష్కను నిర్ణీత విలువ కలిగిన బంగారు ఆభరణముగా భావిస్తున్నారు.

మలివేదకాలం :

ఆర్యుల ఆర్థిక వ్యవస్థలో క్రీ.పూ.1000 తర్వాత పెనుమార్పులు సంభవించాయి. తొలివేద కాలం నాటి పశుపోషణ ఆర్థిక వ్యవస్థ స్థానంలో బలమైన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఆవిర్భవించింది. ఆర్యులు అత్యంత సారవంతమైన గంగా మైదాన ప్రాంతాలకు వలస రావడము మరియు సమర్థవంతమైన ఇనుము సాంకేతిక పరిజ్ఞానమును ఉపయోగించడము వలన ఈ మార్పు సంభవించింది. భారతదేశంలో ఆర్యులు గంగామైదాన ప్రాంతాల్లోనే ఇనుమును తొలిసారిగా ఉపయోగించారు. వేదసాహిత్యములో ఇనుమును శ్యామ ఆయ లేదా కృష్ణ ఆయ అని పిలిచారు. మలివేద కాలంలో వరిని విస్తారంగా పండిచేవారు. వేద సాహిత్యంలో వరిని ‘వ్రిహి” అని పిలిచారు. భారతదేశంలో పప్పుదినుసులు మరియు చెఱకు ఈ కాలంలోనే ప్రవేశపెట్టబడ్డాయి. వేద సాహిత్యంలో 5 రకాల భూములను ప్రస్తావించారు. అవి:

  1. క్షేత్ర: సారవంతమైన భూములు
  2. ఖిల్వక్షేత్ర: బీడు భూములు
  3. అప్రతిహత: అటవీ భూములు
  4. వస్తి: నివాసయోగ్యమైన భూములు
  5. గోపథసార: పచ్చిక బయళ్ల భూములు

ఋగ్వేద కాలంతో పోలిస్తే వ్యాపార వాణిజ్యాలు మరియు హస్తకళా పరిశ్రమలు కొంతవరకు అభివృద్ధి చెందాయి. కుండల పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, వడ్రంగి పరిశ్రమ, లోహ పరిశ్రమ, ఆభరణాల పరిశ్రమ, చర్మ పరిశ్రమ మొదలైనవి అభివృద్ధి చెందాయి. మలి వేద కాలంలోనే గంగా మైదాన ప్రాంతాల్లో తొలిసారిగా నగరాలు వెలిశాయి. ఈ కాలంలో అభివృద్ధి చెందిన హస్తినాపురం, కౌశాంబి, అహిచ్ఛాత్రం మొదలైన నగరాలను గంగా మైదాన ప్రాంతంలోని తొలి నగరాలుగా గుర్తించారు.

ఆర్యుల సామాజిక వ్యవస్థ

ఋగ్వేద కాలం :

ఆర్.యస్.శర్మ అభిప్రాయం ప్రకారం ఋగ్వేద కాలంలో సమానత్వంతో కూడిన గిరిజన సామాజిక వ్యవస్థ (tribal and egalitarian society) కొనసాగింది. తొలి వేదకాలంలోని ఆర్యులు పితృస్వామ్య సమిష్టి కుటుంబ వ్యవస్థ కలిగి ఉండేవారు. కుటుంబ యజమానిని కులప (patriarch) అని పిలిచారు. ఈ కాలంలో ఇంకా వర్ణవ్యవస్థ ఆవిర్భవించలేదు. ఋగ్వేదంలోని పురుషసూక్తములో ప్రస్తావించబడిన వర్ణవ్యవస్థ తర్వాత కాలంలో వ్రాయబడి ఋగ్వేదానికి జోడించబడింది. ప్రధానంగా సమాజంలో 3 వర్గాలుండేవి.

  1. పురోహిత వర్గం: మతపరమైన కార్యకలాపాలు నిర్వహించేవారు.
  2. యుద్ధవీరుల వర్గం: యుద్ధాల్లో పాల్గొనేవారు.
  3. సామాన్య వర్గం: పశుపోషణ, వ్యవసాయం ఇత్యాది కార్యకలాపాలు నిర్వహించేవారు.

సమాజంలో వివిధ వర్గాలున్నప్పటికీ వివక్షతలు లేవు. సామాజిక చలనము (social mobility) అంటే ఒక వర్గం నుంచి మరొక వర్గానికి మారే స్వేచ్ఛ ఉండేది. అనులోమ వివాహాలు (hypergamous), ప్రతిలోమ వివాహాలు (hypogamous) మరియు సహపంక్తి భోజనాలు (inter-dining) అనుమతించబడ్డాయి.

ఋగ్వేదకాలం నాటి సమాజంలో లింగ వివక్షత అనవాళ్ళు లేవు. స్త్రీలకు సంపూర్ణమైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కల్పించబడ్డాయి. బాల్యవివాహాలకు అనుమతి లేనందున మహిళలు పురుషులతో సమానంగా విద్యను అభ్యసించారు. ఋగ్వేదంలో 20 మంది మహిళా మేధావుల ప్రస్తావన ఉంది. వీరిలో గోష, లోపాముద్ర, విశ్వవర, స్వయంవర, అపల మొదలైన వారు ముఖ్యులు. గోష జీవితకాలమంతా విద్యను అభ్యసిస్తూ, బ్రహ్మచారిణిగానే ఉండిపోయి సమాజంలో ‘ఋషిణి’గా గౌరవించబడింది. నియోగ (leviriate) సాంప్రదాయము ఉండేది. సంతానం లేని వితంతువు, చనిపోయిన భర్త సోదరుడిని వివాహం చేసుకోవడాన్ని నియోగ అంటారు. బానిస వ్యవస్థ మరియు సతీసహగమనం లాంటి వ్యవస్థలు ఋగ్వేదంలో ప్రస్తావించబడ్డాయి. ఋగ్వేదంలో సతీసహగమనం నామమాత్రంగా (symbolic) కొనసాగింది. బహుభార్యత్వం (polygamy) తో పాటు, బహుభర్తృత్వం (polyandry) కూడా ఋగ్వేదంలో ప్రస్తావించబడ్డాయి. ఋగ్వేదకాలం నాటి సామాజిక పరిస్థితులు మలివేదకాలంలో సంపూర్ణమైన మార్పులకు గురయ్యాయి. సరళమైన వివక్షతలు లేని వర్గవ్యవస్థ (class divided) స్థానంలో సంక్లిష్టమైన వివక్షతలతో కూడా వర్ణవ్యవస్థ (varna divided) ఆవిర్భవించింది. సామాజిక చలనము, సహపంక్తి భోజనాలు, నిషేధించబడ్డాయి. అనులోమ వివాహాలు అనుమతించబడి, ప్రతిలోమ వివాహాలు నిషేధించబడ్డాయి.

అనులోమ వివాహము: ఉన్నత వర్గం లేదా ఉన్నత కులానికి చెందిన పురుషుడు, దిగువ వర్గం లేదా దిగువ కులానికి చెందిన మహిళను వివాహం చేసుకోవడం.

ప్రతిలోమ వివాహము: దిగువ వర్గము లేదా దిగువ కులానికి చెందిన పురుషుడు ఉన్నత వర్గము లేదా ఉన్నత కులానికి చెందిన మహిళను వివాహం చేసుకోవడం.

సామాజిక, మత మరియు లింగ వివక్షతలకు ఈ కాలంలోనే బీజాలు పడ్డాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పురుషులను ద్విజులని గౌరవించి, శూద్ర మరియు అన్ని వర్ణాల మహిళలను ఏకజులు అని పేర్కొన్నారు. ఏకజులు ఉపనయానికి అనర్హులు.

క్రమంగా మహిళలు తమ గౌరవ స్థానాన్ని కోల్పోయారు. బాల్యవివాహాలు, బహుభార్యత్వం, సతీసహగమనం లాంటి దురాచారాలు కొనసాగాయి. వితంతు వివాహాలను నిషేధించారు, ఐతరేయ బ్రాహ్మణము ఆడపిల్లలు పుట్టడమే సర్వ దుఃఖాలకు కారణమని పేర్కొంటుంది. చట్టబద్ధమైన వారసులను కని వంశాన్ని కొనసాగించడము మరియు కుటుంబంలోని పురుషులకు సేవలందించడమనే రెండు విధులకు మాత్రమే మహిళలను పరిమితం చేశారు.

వేద సాహిత్యములో ప్రస్తావించబడిన 8 రకాల వివాహాలు
  1. బ్రహ్మ వివాహము: అత్యంత ఆదర్శవంతమైన వివాహం. పెద్దల అంగీకారంతో శాస్త్రాల ప్రకారం నిర్వహించబడుతుంది.
  2. దైవ వివాహము: ఇది పురోహితులకు మాత్రమే వర్తిస్తుంది. ఒక యాగాన్ని నిర్వహించిన తర్వాత పురోహితుడికి ఇవ్వవలసిన దక్షిణకు బదులుగా, ఇంట్లో ఉన్న అమ్మాయిని ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది.
  3. ఆర్ష వివాహము: ఒక ఎద్దును, ఆవును వధువుకు కన్యాశుల్కంగా ఇచ్చి నిర్వహించే వివాహము.
  4. ప్రజాపత్య వివాహము: ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా జరిపే వివాహము. అంటే కన్యాశుల్కము గాని, వరకట్నము గాని లేకుండా జరిగే వివాహము.
  5. గాంధర్వ వివాహము: ఇది క్షత్రియులకు మాత్రమే వర్తిస్తుంది. పెద్దలను సంప్రదించకుండా ఎటువంటి వివాహ సాంప్రదాయాలను పాటించకుండా పరస్పర అంగీకారంతో జరిగే ప్రేమ వివాహము.
  6. అసుర వివాహము: ఇది వైశ్యులకు సూచించబడిన వివాహము, వధువును గాని, వరుడిని గాని కొనుక్కొని వివాహము చేసుకోవడము.
  7. రాక్షస వివాహము: ఈ వివాహము క్షత్రియులకు మాత్రమే వర్తిస్తుంది. పెద్దలను వ్యతిరేకిస్తూ ప్రేమించిన అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళి వివాహము చేసుకోవడము.
  8. పైశాచ వివాహము: అన్నింటికంటే నికృష్టమైన వివాహమిది. వధువుకు ఇష్టం లేకపోయినా, ఆమెను బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి వివాహము చేసుకోవడము.
వేద సాహిత్యంలో చెప్పబడిన నాలుగు ఆశ్రమాలు

మలివేద కాలంలో ఒక వ్యక్తి తన జీవితాన్ని నాలుగు దశల్లో జీవించాలని నిర్దేశించబడింది. వీటినే ఆశ్రమాలు అంటాము. అవి:

  1. బ్రహ్మచర్యం: ఈ దశ ఉపనయనముతో ఆరంభమవుతుంది. గురుకులానికి వెళ్ళి విద్యను అభ్యసించాలి.
  2. గృహస్తాశ్రమం: ఈ దశ వివాహముతో ప్రారంభమవుతుంది. వారసులు పుట్టిన తర్వాత ఈ దశను వీడాలి.
  3. వానప్రస్తాశ్రమం: కుటుంబాన్ని వీడి సమీపంలోని వనాలకు వెళ్ళి జ్ఞానాన్ని ఆర్జించాలి. ఈ దశలో వ్యక్తి సమాజములో సభ్యుడిగానే కొనసాగుతాడు.
  4. సన్యాసాశ్రమం: వ్యక్తి జీవితంలో ఇది చివరి దశ. మోక్షం ఈ దశలోనే సాధ్యమవుతుంది. ప్రాపంచిక మరియు సంసార జీవితాన్ని త్యజించి సన్యాసమును స్వీకరించడము.

చాందోగ్య ఉపనిషత్ ఆశ్రమ వ్యవస్థ గురించి తెలియజేసే తొలి గ్రంథం. అయితే ఇందులో మొదటి మూడు ఆశ్రమాలే చర్చించబడ్డాయి. సన్యాసాశ్రమం గురించి దీనిలో ప్రస్తావన లేదు. జబలోపనిషత్ తొలిసారిగా నాలుగు ఆశ్రమాల గురించి ప్రస్తావిస్తా, వాటి వివరాలను ఇస్తుంది.

నాలుగు పురుషార్థాలు

వేదసాహిత్యంలో ఒక వ్యక్తి యొక్క నాలుగు జీవిత లక్ష్యాల గురించి ప్రస్తావన ఉంది. వీటినే పురుషార్థాలు అంటారు. అవి ధర్మార్థకామ మోక్షాలు.

  1. ధర్మ: ధర్మాన్ని పాటించడం
  2. అర్థ: సంపదను ఆర్జించడం
  3. కామ: కోరికలను తీర్చుకోవడం
  4. మోక్ష: ఇది అంతిమ లక్ష్యం. జన్మ-పునర్జన్మ చక్రబంధాన్ని వీడి ఆత్మను పరమాత్మలో విలీనం చేయడం.
ఆర్యుల రాజకీయ వ్యవస్థ

ఋగ్వేద కాలం :

ఈ కాలంలో గిరిజన సంబంధమైన రాజకీయ వ్యవస్థ (tribal polity) కొనసాగింది. ప్రతి తెగకు రాజన్ అనే అధిపతి ఉండేవారు. రాజన్ తెగలోని ప్రజల ద్వారా ఎన్నికోబడేవాడు. దీనిని బట్టి ఆ కాలంలో గణతంత్ర (republic) వ్యవస్థ ఉండేదని అర్థమవుతుంది. రాజన్ నిరంకుశుడు కాదు. పరిమితమైన అధికారాలుండేవి. ప్రతి తెగలో నాలుగు అసెంబ్లీలుండేవి. వీటి నియంత్రణలో రాజన్ పనిచేసేవాడు.

1.సభ: తెగలోని పెద్దలు ఇందులో సభ్యులు. మహిళలకు కూడా దీనిలో స్థానముండేది. దీని తీర్మాణాలను నరిస్త అని పిలిచారు.

2.సమితి: తెగలోని వారందరూ ఇందులో సభ్యులుగా ఉండేవారు.

3.విధాత: వివాదాలు పరిష్కరించడము దీని ప్రధాన విధి. ఇందులో మహిళలకు స్థానం కల్పించబడింది.

4.గణ: దీని గురించి పెద్దగా సమాచారం లేదు.

రాజన్‌కు పరిమితమైన విధులు ఉండేవి. జన (తెగ) మరియు పశువులను (గోవులు) కాపాడటము రాజన్ ప్రధాన విధి. ఈ కాలంలో జనపదాలు లేదా రాజ్యాలు ఏర్పడలేదు. రాజన్‌కు పరిపాలనలో సహకరించడానికి క్రింది అధికారులుండేవారు.

  • పురోహితుడు: పరిపాలనలో రాజన్ తర్వాత స్థానం పురోహితుడిదే.
  • సేనాపతి: ఇతర తెగలతో యుద్ధాలు చేయడంలో ఇతను కీలకపాత్ర పోషించాడు.
  • ప్రజపతి: పశువులకు కావాల్సిన పచ్చిక బయళ్ళను అభివృద్ధి చేసే అధికారి.
  • గ్రామణి: గ్రామాధికారి
  • స్పాస: ఇతను గూఢచారి. శత్రు తెగల రహస్య సమాచారాన్ని రాజన్‌కు చేరవేసేవాడు.
  • జీవగ్రభ లేదా ఉగ్ర: పోలీస్ అధికారి.

రాజన్‌కు ఆదాయ వనరులు పరిమితంగా ఉండేవి. ఋగ్వేద కాలంలో పన్నుల వ్యవస్థ లేనప్పటికీ రాజన్‌కు రెండు ప్రధాన ఆదాయ మార్గాలుండేవి. మొదటిది యుద్ధాల్లో జయించిన సంపద, రెండవది ప్రజలు స్వచ్ఛందంగా రాజన్‌కు ఇచ్చే విరాళము. దీనినే ‘బలి’ అనేవారు. రాజును బలిహర్త (బలిని వసూలు చేసేవాడు) అని పిలిచారు.

ఋగ్వేదంలోని ఆర్య తెగల మధ్య అనేక యుద్ధాలు జరిగినట్లు సమాచారముంది. ఈ కాలంలో యుద్ధాలన్నీ గోవుల కోసం జరిగాయి కాబట్టి యుద్ధాలను ‘గవిప్తి’ అని పిలిచారు. ఋగ్వేద కాలంలో జరిగిన యుద్ధాల్లో ‘దశరాజన్య యుద్ధం’ (Battle of Ten Kings) అత్యంత ప్రముఖమైనది. ఈ యుద్ధం పరుష్ని (రావి) నది ఒడ్డున జరిగింది. భరత తెగకు చెందిన రాజన్ సుధామ పది తెగల కూటమిని ఓడించారు. ఈ కూటమికి పురు తెగకు చెందిన రాజన్ పురుకుత్స నాయకత్వం వహించాడు. ఈ దశ రాజుల యుద్ధంలో భరత తెగకు పురోహితుడైన వశిష్ఠ మరియు పురు తెగకు పురోహితుడైన విశ్వామిత్ర కీలకపాత్ర పోషించారు. సుదాముడి తాతగారైన దివోదాసుడు కూడా అనేక విజయాలు సాధించినట్లుగా ఋగ్వేదం తెలుపుతుంది.

మలివేదకాలం :

ఈ కాలంలో రాజకీయ, పరిపాలన వ్యవస్థల్లో సమూల మార్పులు సంభవించాయి. సంచార జీవితాన్ని కలిగి, పశుపోషణపైన ఆధారపడి ఉన్న ఋగ్వేద ఆర్యులు సప్తసింధు ప్రాంతమును వీడి గంగా మైదాన ప్రాంతాలకు వలస రావడంతో అనేక మార్పులు సంభవించాయి. ఈ కాలంలోనే గంగా మైదాన ప్రాంతాల్లో జనపదాలు (నిర్దిష్ట భూభాగం కలిగిన రాజ్యాలు) అవతరించాయి. మలివేద ఆర్యులు సారవంతమైన గంగా మైదాన ప్రాంతాల్లో వ్యవసాయము చేపట్టడముతో, స్థిర నివాసము సాధ్యమై తద్వారా రాజ్యాలు ఏర్పడటానికి మార్గం సుగమమైంది. మలివేద కాలం నాటి ముఖ్యమైన రాజ్యాలు:

  • మగధ: బృహద్రధ వంశము పాలించింది. బృహద్రధుడు మరియు జరాసంధుడు ఈ వంశంలోని ముఖ్యమైన రాజులు.
  • కాశి: ఈ రాజ్యాన్ని పాలించిన అజాతశత్రువు గొప్ప తత్వవేత్త. ఇతని ఆస్థానంలో బాలాకి గార్గెయ అనే తత్వవేత్త ఉండేవాడు.
  • కురురాజ్యం: దీనికి హస్తినాపురం రాజధాని. పురాణాల ప్రకారం కలియుగంలోని తొలి రాజు పరీక్షితుడు ఈ రాజ్యాన్ని పరిపాలించాడు.
  • వైదేహ రాజ్యం: మిథిలా నగరం రాజధాని. జనకుడు అనే తత్వవేత్త (క్రీ.పూ.8వ శతాబ్దం) పాలించాడు. రామాయణం ప్రకారం ఇతను సీతకు తండ్రి. ఇతను తన రాజ్యంలో ‘బ్రహ్మోదయ’ అనే తత్వవేత్తల పోటీని నిర్వహించాడు. ఇతని ఆస్థానంలోని యజ్ఞావల్క్యుడు ఈ పోటీలలో ఉద్దాలకఅరుణితో సహా తత్వవేత్తలందరినీ ఓడించాడు. ఉద్దాలకఅరుణి గురించి చాందోగ్య ఉపనిషత్తులో ప్రస్తావన ఉంది. యజ్ఞవల్క్య స్మృతి అనే ధర్మశాస్త్రము ఈ కాలంలోనే వ్రాయబడింది. బృహదారణ్యక ఉపనిషత్తులో యజ్ఞావల్క్యుడు తన భార్యలతో జరిపిన తాత్విక సంభాషణలు ఉన్నాయి.
  • పాంచాల రాజ్యం: ప్రవహనజైవాలి అనే తత్వవేత్త పాలించాడు. ఇతని ఆస్థానంలో శ్వేతకేతుఅరుణెయ అనే తత్వవేత్త ఉండేవాడు.
  • కోసల రాజ్యం: అయోధ్య రాజధానిగా ఇక్ష్వాకు వంశం పరిపాలించింది.

మలివేద కాలంలో నిరంకుశ రాచరిక వ్యవస్థలు ఆవిర్భవించాయి. ఋగ్వేద కాలం నాటి రాజన్ ఇప్పుడు చక్రవర్తి అయ్యాడు. తన పదవిని వంశపారంపర్యం చేసుకోవడము వలన రాచరిక వ్యవస్థలు ఆవిర్భవించాయి. యజ్ఞయాగాల వలన చక్రవర్తి అధికారాలు గణనీయంగా పెరిగి, నిరంకుశ రాచరిక వ్యవస్థ ఏర్పడింది. ఋగ్వేదకాలం నాటి గోపాలుడు (గోవులను కాపాడే రాజన్) మలివేద కాలంలో భూపాలుడు (రాజ్యాన్ని/ భూభాగాన్ని కాపాడే చక్రవర్తి) అయ్యాడు. ఈ కాలంలోనే పన్నుల వ్యవస్థ ప్రవేశ పెట్టబడింది. ‘భాగ’ అనే పన్నును ప్రవేశపెట్టారు. మనదేశంలో వసూలు చేయబడిన తొలి పన్ను ‘భాగ’ అని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఒక వ్యక్తి తాను ఉత్పత్తి చేసిన ధాన్యములోను మరియు వస్తువుల్లోను ఒక భాగాన్ని చక్రవర్తికి పన్నుగా చెల్లించాలి. పరిపాలనలో చక్రవర్తికి సహాయకులుగా 12 మంది అధికారులుండేవారు. వీరినే ‘ద్వాదశ రత్నిన్’ అంటారు. అందులో ముఖ్యమైనవారు పురోహిత, సేనాపతి, గ్రామణి, సూత (రథసారధి), భాగదూగ (పన్నులు వసూలు చేసే అధికారి), సంగ్రహిత్రి (కోశాధికారి), స్తపతి (గవర్నర్/ న్యాయమూర్తి), పురపతి (కోటలు/ నగరాలకు రక్షకుడు), శతపథ బ్రాహ్మణము సూత మరియు గ్రామణిని ‘రాజకార్తె’ (రాజును నిర్ణయించేవారు) అని ప్రస్తావిస్తుంది.

ఆర్యుల మత పరిస్థితులు

ఋగ్వేదకాలం నాటి మతంలో ప్రకృతి శక్తుల ఆరాధన అత్యంత ప్రాధాన్యత సంతరించుకొంది. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన 33 మంది దేవుళ్ళు మరియు దేవతలందరూ ప్రకృతి శక్తులే. ఆర్యులు ప్రకృతికి మానవ రూపాన్నిచ్చి మరియు దైవత్వాన్ని ఆపాదించి పూజించారు. విధ్వంసాన్ని సృష్టించే ఉగ్ర ప్రకృతి శక్తులకు పురుష రూపాన్ని మరియు అందంగా, ప్రశాంతంగా ఉన్న ప్రకృతి శక్తులకు స్త్రీ రూపాన్ని ఇచ్చి పూజించారు.

ఋగ్వేదంలోని ప్రధాన దేవుళ్ళు
ఇంద్రుడు వాతావరణ దైవం. యుద్ధాలో విజయాల కోసం ఆర్యులు ఇంద్రుడిని పూజించారు. ఋగ్వేదంలోని 1028 శ్లోకాల్లో 250 శ్లోకాలు ఇంద్రునివే. జితేంద్ర, పురంధర, శతక్రతు, సోమప, అప్సుజిత్, రథేష్ట, మాఘవన్, విత్రాహమ్ అనే బిరుదులు ఇంద్రుడికి ఇవ్వబడ్డాయి.
అగ్ని ఋగ్వేదంలో 200 శ్లోకాలు అగ్నికి అంకితం ఇవ్వబడ్డాయి. దేవతలకు భక్తులకు మధ్యవర్తిగా అగ్నిదేవుడిని పూజిస్తారు. హవ్యవాహనుడు.
వరుణుడు ఋగ్వేదంలోని 20 శ్లోకాల్లో వరుణ దేవుడిని కీర్తించారు. ఇతను 1000 స్తంభాలు మరియు 1000 ద్వారాలు కలిగిన భవంతిలో నివసిస్తాడు. తన పాశముతో పాపులను శిక్షిస్తాడు.
త్వస్త్రి అగ్ని పర్వతాలను త్వస్త్రిగా  పూజించారు.
మారుత్‌ పిడుగులను మారుత్‌ అని పూజించారు.
అశ్వినీ దేవతలు ఔషధపు మొక్కలను అశ్వినీ దేవతలుగా పూజించారు.
వాయు గాలిని వాయుదేవునిగా పూజించారు.
పుషాన్‌ శూద్రుల దైవము
సోమ సోమ అనే మొక్కను దేవుడిగా పూజించారు. ఋగ్వేదములోని తొమ్మిదవ మండలంలోని 114 శ్లోకాలతో సహా మొత్తం 120 శ్లోకాలు సోమదేవుడికి అంకితం ఇవ్వబడ్డాయి.
ఋగ్వేదంలోని దేవతలు
ఉషస్‌ ఉషోదయమును (dawn) ఉషస్‌ దేవతగా పూజించారు.
అదితి భూమాత
అరణ్యయని అరణ్యాలను దేవతగా పూజించారు.
సావిత్రి వెలుగును సావిత్రి దేవతగా పూజించారు. ఋగ్వేదంలోని సుప్రసిద్ధ గాయత్రి మంత్రం ఈ దేవత యొక్క ప్రార్థన.

ఋగ్వేదకాలం నాటి ఆర్యులు ప్రార్థనలు మరియు నైవేద్యంతో తమ దేవతలను ఆరాధించారు. సోమ అనే మొక్క నుండి తయారుచేసిన సోమ పానీయాన్ని దేవతలకు నైవేద్యంగా పెట్టారు. ఈ కాలంలోని ఆర్యులు ఇహలోక సౌకర్యాల కోసమే దేవుళ్ళను ఆరాధించారు. పరలోక చింతన మరియు ఆధ్యాత్మికత వీరిలో లేదు. యుద్ధాల్లో విజయాల కోసం, సంతానం కోసం మరియు పశువుల కోసం మాత్రమే దేవతలను ఆరాధించారు.

మలివేదకాలం :

మలివేదకాలంలో మతవ్యవస్థలో కూడా సంపూర్ణ మార్పులు సంభవించాయి. 33 మంది ప్రకృతి దేవతల స్థానంలో ప్రజాపతి లేదా బ్రహ్మ (సృష్టికర్త), విష్ణువు (లోక రక్షకుడు) మరియు రుద్ర (చెడును నాశనం చేసేవాడు) అనబడే త్రిమూర్తులు ఆవిర్భవించారు. ఋగ్వేదకాలం నాటి దేవుళ్లు తమ ప్రాధాన్యతను కోల్పోయి త్రిమూర్తులకు లోబడి కొనసాగారు. అందులో 8 మంది దేవుళ్ళు అష్టదిక్పాలకులు (8 దిక్కులను) కాపాడేవారు) గా నియమించబడ్డారు.

  1. తూర్పు దిక్కు: ఇంద్రుడు
  2. పశ్చిమ దిక్కు: వరుణుడు
  3. ఉత్తర దిక్కు: కుబేరుడు
  4. దక్షిణ దిక్కు: యముడు
  5. ఆగ్నేయ దిక్కు: అగ్ని
  6. నైఋతి దిక్కు: సూర్యుడు
  7. వాయువ్య దిక్కు: వాయు దేవుడు
  8. ఈశాన్య దిక్కు: సోమ దేవుడు

మలివేద కాలంలో సంక్లిష్టమైన, వ్యయ ప్రయాసలతో కూడిన యజ్ఞయాగాలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. మతంలో పరలోక చింతన ఎక్కువైంది. తాత్విక ఊహాగానాలు కొనసాగాయి. ఆత్మ – పరమాత్మ, జన్మ- పునర్జన్మ, మోక్షము ఇత్యాది అంశాలకు ప్రాధాన్యత పెరిగింది.

సింధునాగరికతకు మరియు వైదిక నాగరికతలకు మధ్య వ్యత్యాసాలు

భారతదేశంలో క్రీ.పూ.2500 – 1750 ల మధ్య విరాజిల్లిన సింధు నాగరికత మరియు క్రీ.పూ.1500 – 600ల మధ్య అభివృద్ధి చెందిన వైదిక నాగరికతల మధ్య పోలికల కంటే వ్యత్యాసాలే ఎక్కువగా గమనించవచ్చు. రెండు నాగరికతల మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసాలను ఈ క్రింద చర్చించడమైనది.

సింధు నాగరికత పూర్తిగా స్వదేశీయమైనది మరియు ద్రావిడులకు చెందినది కాగా వైదిక నాగరికతను అభివృద్ధి చేసిన ఆర్యులను విదేశీయులుగా భావిస్తున్నారు. సింధు నాగరికత పూర్తిగా పురావస్తు త్రవ్వకాల ద్వారా అధ్యయనం చెయ్యబడితే, వైదిక నాగరికతకు సంబంధించిన సమాచారం వేద సాహిత్యము ద్వారా తెలుసుకోవచ్చు. అదే విధంగా సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత కాగా, వైదిక నాగరికత గ్రామీణ నాగరికత.

సింధు నాగరికతలో వర్గ వ్యవస్థ కనిపిస్తుంది. సమాజంలో ధనిక మరియు పేద వర్గాలుండి, అసమానతలు కొనసాగాయి. ఆర్యుల కాలంలో అత్యంత క్లిష్టమైన వర్ణవ్యవస్థ ఆవిర్భవించింది. సమాజంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనబడే నాలుగు వర్ణాలు పుట్టుకొచ్చాయి. సింధు నాగరికత కాలంలో మహిళలకు లభించిన గౌరవ మర్యాదలు, ఆర్యుల కాలంలో బాగా తగ్గాయి.

సింధు ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారితమైనది. బార్లి, గోధుమలు ఈ కాలం నాటి ప్రధాన ఆహారధాన్యాలు. ఆర్యులు ప్రధానంగా పశుపోషకులు, మలివేద కాలంలో వీరికి వ్యవసాయం ప్రధానవృత్తిగా మారింది. వరి వీరికి ప్రధాన ఆహారమయ్యింది. సింధు ప్రజలు అనేక రకాల పరిశ్రమలను అభివృద్ధి చేసి, దేశ విదేశాలతో వాణిజ్యం నిర్వహించారు.

ఇలాంటి అభివృద్ధి ఆర్యుల నాగరికతలో అరుదుగా కనిపిస్తుంది. సింధు ప్రజలు కేవలం రాగి మరియు కాంస్యమును ఉపయోగించగా, మలివేద ఆర్యులు ఇనుమును కూడా విరివిగా ఉపయోగించారు.

మతరంగంలో కూడా ఈ రెండు నాగరికతల మధ్య అనేక వ్యత్యాసాలు కనిపిస్తాయి. సింధు ప్రజలకు మాతృదేవత మరియు పశుపతి మహాదేవుడు ప్రధాన దైవాలు. వీరు లింగాలను, ఎద్దులను, పాములను మరియు చెట్లను పూజించారు. ప్రారంభంలో ఆర్యులు ప్రకృతి శక్తులైన ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయు దేవుళ్ళను పూజించి తర్వాత కాలంలో త్రిమూర్తులను పూజించారు. జంతుబలులతో కూడా యజ్ఞయాగాలను ఆచరించారు. సింధు నాగరికత కాలం నాటి విగ్రహారాధన, ఆర్యుల నాగరికతలో ఏ మాత్రము కనిపించదు.

సింధు నాగరికత మరియు వైదిక నాగరికతలు పరస్పర భిన్నమైన నాగరికతలైనప్పటికినీ, ప్రస్తుత భారత నాగరికతకు ఈ రెండూ కలిసి పునాదులు వేసాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Leave a Comment

error: Content is protected !!